ప్రజల ఇబ్బందులు తీరేలా పనుల ప్రణాళికల్ని సిద్ధం చేయండి

*ప్రజల ఇబ్బందులు తీరేలా పనుల ప్రణాళికల్ని సిద్ధం చేయండి

ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులకు పరిటాల శ్రీరామ్ సూచన

15వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులతో సమావేశం

ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకోవాలన్న శ్రీరామ్

ప్రజల ఇబ్బందులు తీరేలా, అలాగే గ్రామాలు, కాలనీల్లో సమస్యలు తీరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు. 15వ ఆర్థక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ ఎంపీడీఓలు, ధర్మవరం మున్సిపల్ కమిషనర్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ధర్మవరంలోని శ్రీరామ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మండలాలు, పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. మండలానికి ఎంత మేర నిధులు రావచ్చు.. వాటితో ఎలాంటి పనులు చేయబోతున్నారన్న అంశాల గురించి చర్చించారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో గ్రామాల్లో తాగునీరు, స్మశాన వాటికలు, డ్రైనేజీలు, రోడ్లువంటివి ఉన్నాయన్నారు. ముందుగా వీటికి ప్రధాన్యత ఇస్తూ పనుల రూపకల్పన చేయాలని శ్రీరామ్ సూచించారు. ప్రధాన్యత వారిగా పనులు చేపట్టాలన్నారు. ధర్మవరం పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలు చెప్పారని.. వాటి పై దృష్టి సారించాలని కమిషనర్ తో అన్నారు. ముందుగా గ్రామాలు, కాలనీల్ని ఒకసారి పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు..