
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. రాష్ట్రంలో వర్షాలకు అవకాశం
అమరావతి, జూలై 5 ,అనంతజనశక్తి న్యూస్
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మేఘావృతంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.







