
*సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై పవన్ కళ్యాణ్ ఆరా
• విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
• మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచన
విశాఖపట్నం జూలై 05 అనంత జనశక్తి న్యూస్
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు Pawan Kalyan ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు, గాలింపు చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణమైనట్టు, కొన్ని గంటల్లో తీరానికి చేరుకుంటారనగా ఆచూకీ గల్లంతైనట్టు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే నేవీకి చెందిన హెలీకాప్టర్ తో గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.







