
సంక్రాంతి కానుకగా తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
పెండింగ్ హామీల అమలుకు మరో అవకాశం – అర్హులందరికీ పథకాలు
హైదరాబాద్, జనవరి 07,అనంత జనశక్తి న్యూస్
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, పెండింగ్లో ఉన్న హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యోగుల బకాయిలను ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో విడుదల చేస్తూ, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త కార్యక్రమాలను కూడా సిద్ధం చేస్తోంది.అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో ఇచ్చిన హామీల అమలుదిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు మరో ఛాన్స్
సంక్షేమ పథకాల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటివరకు లబ్ధి పొందని వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కొత్త విధి విధానాలను ఖరారు చేసింది.ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులను నియమించి, వారి ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు. గతంలో రేషన్ కార్డు లేకపోవడం, వివరాల్లో పొరపాట్ల కారణంగా పథకాలకు దూరమైన వారిని ప్రభుత్వం గుర్తించి, ఈ అవకాశం కల్పించింది.
కొత్త రేషన్ కార్డులతో అర్హత
ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులయ్యారు. అటువంటి వారు తమ సమీప ఎంపీడీవో కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే మున్సిపల్ వార్డుల్లో నియమించిన ప్రజాపాలన అధికారులకు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
అవసరమైన పత్రాలు
గృహజ్యోతి పథకం (200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్):
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు
మహాలక్ష్మి పథకం (రూ.500కే గ్యాస్ సిలిండర్):
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలు
లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన ఒక్కరిని కూడా వదలకుండా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది.








