
యాదగిరిగుట్టలో బంగారం–వెండి డాలర్లు మాయం
ఆడిట్లో వెలుగులోకి వచ్చిన ఆలయ ఆస్తుల అదృశ్యం
యాదగిరిగుట్ట జనవరి 28 అనంత జనశక్తి న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. ఆలయ ప్రచార విభాగానికి చెందిన విలువైన బంగారం–వెండి డాలర్లు అదృశ్యమైనట్లు తాజాగా జరిగిన ఆడిట్లో బయటపడింది.గత ఏడాదిలోనే ఈ డాలర్లు మాయమైనప్పటికీ, తాజాగా నిర్వహించిన ఆడిట్ ప్రక్రియలో ఈ విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. డాలర్ల విలువ లక్షల్లో ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన విలువైన ఆస్తులు మాయమవడం భక్తుల్లో ఆందోళనకు కారణమవుతోంది.ఈ ఘటనపై ఆలయ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆలయ భద్రత, లెక్కల నిర్వహణపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి.








