
భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు పై భక్తుల సంతృప్తి
ఆదివారం దుర్గ గుడిలో భవాని దీక్ష ఏర్పాట్లు ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రభుత్వ యంత్రాంగం వివిధ శాఖల మధ్య పూర్తి సమన్వయం తో కొనసాగుతున్న భవానీ దీక్షలు విరమణ
విజయవాడ, డిసెంబర్ 14.అనంత జనశక్తి న్యూస్
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవాని దీక్షల విరమణ నాలుగో రోజున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. రామచంద్ర మోహన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు . పవిత్రమైన భవాని దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ తో పాటు, పోలీస్ కమిషనర్ ఇతర జిల్లా అధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన, కీలకమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ ప్రశంసించారు. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారు. ప్రక్రియ అంతా సజావుగా, విజయవంతంగా కొనసాగుతోందని దేవాదాయ కమీషనర్ రామచంద్రమోహన్ వివరించారు. చివరి రోజు మరో లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది మొత్తం 5.5 నుండి 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అధికారులకు కమిషనర్ రామచంద్ర మోహన్ అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజుకు సరిపడా ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం, క్యూ లైన్లలో ఉన్న భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.అధికారులు కల్పించిన వసతులు, సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.క్యూ లైన్లలో వేచి ఉన్న భవానీలకు కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీన నాయక్,తో కలిసి స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ) దుర్గగుడి ఉద్యోగులు తదితరులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు.








