భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ.

విశాఖపట్నం అక్టోబర్ 02 :అనంత జనశక్తి న్యూస్

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చరవాణీలో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులు అందరూ అందుబాటులో ఉండేలా, విపత్కర పరిస్థితుల్లో తక్షణ తోడ్పాటు అందించే విధంగా ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. అలాగే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఫోన్ లో సంభాషించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని నదులు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా జాతీయ రహదారుల అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ రహదారిలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెట్లు వంటివి నేల కూలే పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఈ రెండు రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలని కోరారు. నది పరివాహక ప్రాంతాల వాళ్ళు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీకాకుళం కలెక్టరేట్ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 08942-240557 నంబర్ ను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని కోరారు. వాయుగుండ ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాల ప్రభావం ఉంటుందని, అటు తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో స్వల్ప వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజలు సురక్షితంగా ఉండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.