అరవ శ్రీధర్ వివాదం ముదురుతోంది 

బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల

విజయవాడ మార్చి 21 అనంత జనశక్తి న్యూస్

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. బాధితురాలిగా పేర్కొంటున్న హర్షవీణ మరో వీడియో విడుదల చేసి పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.హర్షవీణ తన వీడియోలో మాట్లాడుతూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “అరవ శ్రీధర్‌కు జనసేన పార్టీ క్లీన్ చిట్ ఇచ్చిందా..? ఇచ్చి ఉంటే అధికారికంగా తనకు తెలియజేయాలి” అంటూ ప్రశ్నించింది. క్లీన్ చిట్ ఇవ్వకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటే పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది.ఇప్పటికే ఈ వ్యవహారానికి రెండు నెలలు గడిచినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.అంతేకాకుండా, తనకు న్యాయం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను నేరుగా కోరింది. ఈ అంశంపై పార్టీ తక్షణమే స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ ఘటనపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.