కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో నేడు శేష వాహనం

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో నేడు శేష వాహనం

కదిరి మార్చి 05, అనంత జనశక్తి న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి పరవశంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి బ్రహ్మ గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని తూర్పు రాజగోపురం కింద దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తూర్పు గోపురం వద్ద భక్తులతో కిక్కిరిసిపోయింది.అలంకార భూషితుడిగా గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారి దివ్య రూపం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తి గీతాలు, మంగళ వాద్యాల నాదాలతో మార్మోగింది.దేవస్థాన అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు “గోవిందా గోవిందా”, “లక్ష్మీనరసింహ స్వామికి జై” అంటూ నినాదాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శేష వాహనం కార్యక్రమం నిర్వహించనున్నారు. శేష వాహనం పై స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.కదిరి పట్టణం మొత్తం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.