
కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంలో వైభవంగా
కదిరి మార్చి 06, అనంత జనశక్తి న్యూస్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు శేష వాహనంపై ఆలయ వీధుల్లో అద్భుతంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చారు.శేష తలపాగలపై మహిమాన్వితంగా కూర్చున్న స్వామివారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి “గోవింద… గోవింద…” నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. భక్తులు హారతులు సమర్పిస్తూ స్వామివారి కటాక్షం కోరుకున్నారు.ఆలయాన్ని విద్యుద్దీపాలతో, పుష్పాలతో అద్భుతంగా అలంకరించగా బ్రహ్మోత్సవాల వేళ కదిరి పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. వేద పండితుల వేదఘోషల మధ్య, మంగళవాయిద్యాల నాదంలో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది.ఈ రోజు (మార్చి 6) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరమానందం పొందుతున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.








