నాడు నరకప్రాయం – నేడు సుఖవంతమైన ప్రయాణం

నాడు నరకప్రాయం – నేడు సుఖవంతమైన ప్రయాణం

కూటమి ప్రభుత్వంలో రోడ్ల విప్లవం తెచ్చామన్న మంత్రి కందుల దుర్గేష్

ఉండ్రాజవరంలో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు ఏప్రిల్ 04,అనంత జనశక్తి న్యూస్

కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పర్యటించారు. ఉండ్రాజవరం గ్రామంలో రూ. 4 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో నూతనంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల ప్రధాన సీసీ రహదారిని ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ఆ రోడ్డుపై నడుస్తూ గ్రామస్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నుండి స్థానికంగా కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వరకు బైక్ పై ప్రయాణించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యాయని, వారి సహకారంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి, విస్తరణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత ఐదేళ్ల (2019-24) పాలనలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, కనీసం గుంతలు పూడ్చే నాధుడు లేక ప్రయాణికులు నరకం చూశారని ఫైర్ అయ్యారు..కొత్త రోడ్ల నిర్మాణం దేవుడెరుగు కనీసం ఉన్న రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. కానీ నేడు నిడదవోలు నియోజకవర్గంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరుగుతోందని ప్రజలే సాక్ష్యం చెబుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పదే పదే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సీఎం, డిప్యూటీ సీఎంల ప్రత్యేక చొరవతో నిధులు రాబట్టి నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.ఉండ్రాజవరం నుండి కొండాలమ్మ దేవాలయం వరకు నిర్మించిన ఈ 1200 మీటర్ల సీసీ రోడ్డు వల్ల స్థానిక వ్యాపారులకు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తొలిగాయని, ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే కూటమి ప్రభుత్వానికి అసలైన నిదర్శనమన్నారు.

అమరావతికి చట్టబద్ధత – కేక్ కట్ చేసి సంబరాలు:

ఇదే సందర్భంలో, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.ఉండ్రాజవరంలో కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. “జై అమరావతి.. జై మోదీ.. జై చంద్రబాబు.. జై పవన్ కళ్యాణ్” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బైక్ పై ప్రయాణించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు మరియు భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.