ప్రజాగళాన్ని అణిచేస్తామంటే సహించం

ప్రజాగళాన్ని అణిచేస్తామంటే సహించం

ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ కానివ్వం

అధికార పార్టీకి దాసోహమైన పోలీసులకు బుద్ధి చెబుతాం

ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం

వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అనంతపురం, నవంబర్‌ 14 : అనంత జనశక్తి న్యూస్

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాగళాన్ని అణచివేస్తామంటే సహించేది లేదని, బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా తిరిగొస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీ తపోవనం సర్కిల్‌లో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హాజరై నాయకులు, కార్యకర్తలతో కలిసి శిబిరంలో సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 7 కాలేజీలు పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన 10 కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ సక్సెస్‌ అయ్యిందని తెలిపారు. ఈనెల 12వ తేదీన అనంతపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు తరలివచ్చారన్నారు. మరుసటి రోజే ర్యాలీలో పాల్గొన్న వారి ఫొటోలు పెట్టుకుని యువకులను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి రౌడీషీట్‌ తెరుస్తాం అంటూ బెదిరించి బెండోవర్‌ కోసం సంతకాలు చేయించుకోవడం దురదృష్టకరమన్నారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాగళాన్ని అణగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు. అప్రజాస్వామ్య పద్ధతిలో అధికార పార్టీకి దాసోహమైన పోలీసులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అక్రమ నిర్బాంధాలు చేస్తే ప్రజలతో పోలీస్‌స్టేషన్లను నింపుతామని స్పష్టం చేశారు. మెడికల్‌ కాలేజీల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.