
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి
• హోమ్ శాఖ మంత్రి శ్రీమతి అనితపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరం
• మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే
• ప్రతి మాటనూ పౌర సమాజం గమనిస్తోందని మరచిపోవద్దు
విజయవాడ జూన్ 16, అనంత జనశక్తి న్యూస్
రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పై ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాఖ్యలు కేవలం శ్రీమతి అనిత గారు గురించి అన్నట్లే కాదు… సగటు మహిళలందరినీ కించపరచినట్లే. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అవి విధానపరంగానే ఉండాలి. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలి. కూటమి నేతలందరికీ ఒక సూచన చేస్తున్నాను. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టేటప్పుడు – వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియచెప్పాలి. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలి. అవతలి పార్టీవాళ్ళ మాదిరి దిగజారుడు భాష, ఆర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదు.







