అప్పు వివాదం హత్యకు దారి

అప్పు వివాదం హత్యకు దారి

ధర్మవరంలో నిందితుడి అరెస్ట్…

ధర్మవరం జులై 3 అనంత జనశక్తి న్యూస్ :

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ను పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం ధర్మవరం పట్టణానికి చెందిన మందల కరుణాకర్, పశ్చిమ బెంగాల్‌ కు చెందిన హజ్రత్ అలీ ఇద్దరూ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటూ బెల్దారి పనులు చేసేవారు. మద్యం సేవించే అలవాటు ఉన్న వీరిద్దరి మధ్య డబ్బు అప్పు విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో నిందితుడు తన అద్దె గదిలో మద్యం సేవిస్తున్న సమయంలో అప్పు విషయమై జరిగిన వాగ్వాదంలో సిమెంట్ ఇటుకతో కరుణాకర్ తల పై బలంగా దాడి చేశాడు. అనంతరం యాక్స్ బ్లేడ్‌తో ఎడమ చెవిని కోసి తీవ్రంగా గాయపరిచాడు. తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ జూలై 2 న మృతి చెందడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ధర్మవరం టు టౌన్ సీఐ జయ నాయక్, ఎస్సై వీరేష్ నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాల సహాయంతో గాలింపు చేపట్టి, జూలై 3 న మధ్యాహ్నం ఇందిరమ్మ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశాయి. నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన యాక్స్ బ్లేడ్‌ తో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌ కు తరలించింది.