క్యూలైన్లలో నిరీక్షణకు చెక్‌

క్యూలైన్లలో నిరీక్షణకు చెక్‌

శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

వేసవి రద్దీలో సామాన్యులకు ఊరట

సర్వదర్శనం టోకెన్‌ ఉన్నవారికి అవకాశం

ఎస్వీ మ్యూజియం వైపు నుంచి ఉన్న ‘రీ-ఎంట్రీ’ పాయింట్‌

వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తుతోంది. ప్రతిరోజూ సుమారు 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కష్టాలను తీర్చడానికి తితిదే కల్పిస్తున్న ‘రీ-ఎంట్రీ’ (తిరిగి ప్రవేశించడం) సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతోంది.

సద్వినియోగం ఇలా..

సర్వదర్శనం టోకెన్‌ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శన సమయానికి క్యూలైన్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించే సదుపాయమే ఈ రీ-ఎంట్రీ.భక్తులు ముందుగా సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లాక వైకుంఠం-2లో ఆధార్‌ సమర్పించి టోకెన్‌ పొందాలి. బయటకు వెళ్లాలనుకొనేవారికి 17వ కంపార్టుమెంట్‌ వద్ద రీఎంట్రీ పాస్‌ ఇస్తారు. అక్కడే ఉన్న ఎగ్జిట్‌ పాయింట్‌ ద్వారా బయటకు రావచ్చు. ఆ సమయంలో తప్పనిసరిగా టోకెన్‌ను స్కాన్‌ చేయించుకోవాలి.బయటకు వచ్చిన తర్వాత భక్తులు తమ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు లేదా తిరుమలలోని ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు.

తిరిగి ఎలా వెళ్లాలి?

తితిదే అధికారులు కేటాయించిన సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందుగానే సంబంధిత కంపార్టుమెంట్‌ వద్దకు చేరుకోవాలి. తిరిగి లోపలికి వెళ్లడానికి లడ్డూ కౌంటర్ల వైపు కాకుండా, మ్యూజియం పక్క నుంచి డబ్ల్యూ-4 గేట్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే రీ-ఎంట్రీ కేంద్రం ఉంటుంది. నిర్ణీత సమయానికి లోపలికి వెళ్లి కంపార్టుమెంట్లు తెరుచుకున్న తర్వాత కేవలం 2 నుంచి 4 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తవుతుంది.

టోకెన్‌ భద్రం..

టోకెన్‌ను జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకవేళ టోకెన్‌పోతే రీ-ఎంట్రీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.ఆలస్యాన్ని నివారించడానికి నిర్దేశిత సమయం కంటే ముందే పాయింట్‌కు చేరుకోవాలి.మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను దర్శనానికి అనుమతించరు. వాటిని ముందుగానే గదుల్లో లేదా లగేజీ కౌంటర్లలో భద్రపరుచుకుని రావాలి. ఈ గేట్‌ పరిధిలో వస్తువులు డిపాజిట్‌ చేయడానికి కౌంటర్లు ఉండవు.