
సత్యసాయి ప్రేమ శాశ్వతం… సేవే పరమధర్మం : ప్రధాని మోదీ
శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి):అనంత జనశక్తి న్యూస్
పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించగా, కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు. “ఎందరో మహానుభావులు… అందరికీ వందనములు” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రారంభించారు.
“జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం” — మోదీ
సత్యసాయి భౌతికంగా లేకున్నా, ఆయన ప్రేమ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. “సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నాకు గొప్ప అదృష్టం” అని పేర్కొన్నారు.
సత్యసాయి – విశ్వప్రేమకు ప్రతిరూపం
సత్యసాయి జీవితం మొత్తం మానవసేవకే అంకితం అయిందని, ఆయన బోధనలు దేశమంతా ప్రభావం చూపుతున్నాయని ప్రధాని అన్నారు.“భక్తి, జ్ఞానం, కర్మ ఆ మూడు సేవతోనే ముడిపడి ఉన్నాయి. సేవే పరమధర్మం అని భారతీయ నాగరికత చెప్పింది” అని వివరించారు.
“అందరినీ ప్రేమించు… అందరినీ సేవించు” – బాబా నినాదం
బాబా చెప్పిన ఈ నినాదం లక్షలాదిమంది జీవితాలను మార్గనిర్దేశం చేసిందని ప్రధాని గుర్తుచేశారు.దేశవ్యాప్తంగా కోట్ల మంది సత్యసాయి భక్తులు నిత్యం సేవచేస్తూ బాబా చూపిన దారిలో నడుస్తున్నారని పేర్కొన్నారు.
బాబా బోధనలు – కోట్ల మందికి మార్గదర్శకం
సత్యసాయి బోధనలు అనేక జీవితాలను సమూలంగా మార్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.‘ప్రేమ, కరుణ, సేవ’ అనే ఆయన సూత్రాలు నేటికీ సమాజాన్ని సానుకూల దిశగా నడిపిస్తున్నాయని చెప్పారు.








