రంగారెడ్డి రోడ్డు విషాదం… 24మంది మృతి
చేవెళ్ల, నవంబర్ 3 ,అనంత జనశక్తి న్యూస్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 24మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. బస్సు కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో బయటపడింది.ఈ దారుణ ఘటన చేవెళ్ల సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 4.45 గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరింది. ఉదయం 7.05 గంటల సమయంలో చేవెళ్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న టిప్పర్ లారీ (సుమారు 50 టన్నుల కంకర లోడుతో) రోడ్డులో గుంతను తప్పించబోయి, రహదారి పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దెబ్బతింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పలువురి మృతదేహాలు అక్కడికక్కడే నలిగిపోయాయి.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ “టిప్పర్ వేగంగా వచ్చి గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టింది” అని తెలిపారు.