రిటైర్డ్ జడ్జికి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసం
రూ.1.66 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
బెంగళూరు మార్చి 09, అనంత జనశక్తి న్యూస్
సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త పద్ధతితో మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి సుమారు రూ.1.66 కోట్లు కాజేసిన ఘటన చోటుచేసుకుంది.సమాచారం ప్రకారం, సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి తాము Central Bureau of Investigation (CBI) అధికారులు అని పరిచయం చేసుకున్నారు. మీపై మనీలాండరింగ్ మరియు మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని చెబుతూ రిటైర్డ్ జడ్జిని భయభ్రాంతులకు గురిచేశారు.మీ ఆధార్కు లింక్ అయిన రెండు మొబైల్ నెంబర్ల ద్వారా మహిళలకు అభ్యంతరకర కాల్స్ వెళుతున్నాయని, ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని కూడా అబద్ధపు సమాచారం ఇచ్చారు. బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో మీపై కేసు నమోదు అయిందని చెప్పి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.ఇది విచారణలో భాగమని, మీరు ప్రస్తుతం ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని, ఇంటి నుంచి బయటకు రావద్దని అలాగే ఈ విషయం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చర్చించవద్దని హెచ్చరించారు. మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని చెప్పి, విచారణ పూర్తయ్యాక మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తామని నమ్మబలికారు.అరెస్టు చేస్తే ప్రతిష్టకు భంగం కలుగుతుందని భయపడిన రిటైర్డ్ జడ్జి, మోసగాళ్లు చెప్పిన విధంగా విడతలవారీగా మొత్తం రూ.1.66 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు. అయితే అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు మేరకు నేరేడ్మేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ మోసానికి పాల్పడిన సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు.ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.