అరటి రైతు కుదేలు
ధర పతనంతో రైతన్నలు తీవ్ర ఆందోళన
ఎకరాకు లక్ష పెట్టుబడి
గతేడాది టన్ను 20 వేలు ప్రస్తుతం టన్ను 4 నుండి 5 వేల రూపాయలే
కళ్యాణదుర్గం సెప్టెంబర్ 18,అనంత జనశక్తి న్యూస్
గతకొన్ని రోజులుగా టమాటా, ఉల్లి, చీనీ ధరలు పతనం కాగా తాజాగా అరటి ధరలు పడిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుసెనగ తర్వాత అరటి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టారు.
తగ్గిన ఎగుమతులు..
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సుగంధాలు. పచ్చ అరటి, కర్పూరం, చక్కరకేళి, అమృత పాణి రకాలు ఎక్కువగా సాగు చేశారు. ఈ అరటికి మంచి డిమాండ్ ఉండటంతో దిల్లీ, ఇరాన్, ఇరాక్ దేశాలకు ఎగుమతి అవుతాయి. జిల్లాలోని పుట్లూరు, యల్లనూరు, నార్పల, తాడిమర్రితో పాటు ముదిగుబ్బ, తలుపుల, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో అరటి ఎక్కువగా సాగులో ఉంది. సెప్టెంబరు మొదటి నుంచి ధరలు పూర్తిగా పడిపోవడంతో దిగుబడి కొనేవారు కరవయ్యారు. టక్కు అధికంగా రావడంతో మన అరటికి డిమాండ్ తగ్గింది.
టన్ను రూ.4 వేల నుంచి 5 వేలు
జూన్, జులై నెలల్లో టన్ను ధర రూ.15 వేల నుంచి 18 వేలు ఉండగా, వేసవిలో రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు ధరలు పలికాయి. గత నెలలో టన్ను రూ.9,500 నుంచి రూ.12 వేల వరకు పలికింది. ప్రస్తుతం టన్ను రూ. 4 వేలు, రూ.5 వేలు పలకడంతో తోట మీదనే పంటను వదిలేస్తు న్నారు. కొందరు స్వయంగా గెలలు కత్తిరించి ఆటోలో స్థాని కంగా తోపుడుబండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు.ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన ఓబిలేసు గతేడాది డిసెంబరులో ఐదు ఎకరాల్లో రూ.6 లక్షల పెట్టుబడి పెట్టి అరటి సాగు చేశారు. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాలేదు. టన్ను రూ.2,300తో ఐదు టన్నులు ఆటోలో మండీలకు తరలించారు.