చింతమనేనికి కూటమి పార్టీల అండ..
దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో సంఘీభావ సమావేశం
దెందులూరు జూన్ 16,
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మద్దతుగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో దుగ్గిరాల క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు చింతమనేనితో భేటీ అయి సంఘీభావం ప్రకటించారు.టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకుని తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, “మీ ఎమ్మెల్యే చింతమనేనికి మేమంతా అండగా ఉన్నాం.. ఎప్పటికీ ఉంటాం కూడా” అని స్పష్టం చేశారు.ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, “రాజకీయాల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చింతమనేని ప్రభాకర్” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా దెందులూరు కూటమి శ్రేణులు మాట్లాడుతూ, కోవర్ట్ రాజకీయాలపై ప్రారంభ దశలోనే స్పందిస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.అలాగే, “ఆ శ్రీనివాస్ కేవలం పేరుకే టీడీపీ కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుకుగా పాల్గొనలేదు. అలాంటి వ్యక్తి గురించి ఇకపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని కామినేని శ్రీనివాస్, బడేటి చంటి పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం.ఈ సమావేశం ద్వారా చింతమనేని ప్రభాకర్కు కూటమి పార్టీల పూర్తి మద్దతు ఉందనే సందేశం కార్యకర్తలకు, ప్రజలకు వెళ్లిందని నాయకులు పేర్కొన్నారు.