ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు దేవినేని రమణ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (గొల్లపూడి) - 20 సెప్టెంబర్ 2025
స్వర్గీయ దేవినేని రమణ జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలసి రమణ చిత్రపటానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, రమణ ఒక కార్యకర్తగా నందిగామ ప్రాంత రాజకీయాల్లో అడుగు పెట్టారని స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రేమ అభిమానులతో అతి తక్కువ కాలంలో ఎన్నికల్లో రమణ శాసనసభ్యునిగా గెలిచి ఆనాటి ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రమణలో ఉన్న పనిచేసే తత్వం పార్టీని ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో రమణకి విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అనతికాలంలోనే విద్యాశాఖలో సమూలమైన మార్పులను తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రమణ బలమైన ముద్ర వేశారని తెలిపారు. శ్రమదానం అనే పేరుతో చంద్రబాబు నాయుడుని కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి తీసుకువచ్చి మున్నేరు కట్టలేరు కృష్ణపై ఎత్తిపోతల పథకాల ద్వారా ఆప్రాంత రైతాంగ సాగునీటి సమస్యలను తీర్చగలిగారని గుర్తు చేసారు. జగ్గయ్యపేట నందిగామ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వాలని వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసి తర్వాత మనమధ్య లేకుండాపోయారని తెలిపారు. పేదలపాలిట పెన్నిదిగా, రైతుజన బాంధవుడిగా ప్రజాసేవే పరమావధిగా పనిచేసి దశాబ్దాలు గడిచినా అసలైన ప్రజా నాయకుడిగా రమణ ప్రజల గుండెల్లో కొలువై శాశ్వతస్థానం సంపాదించుకున్నారని అన్నారు.