అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పురాతన ఆలయం
ఒకప్పుడు ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం
కంబదూరులోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో మద్యం సీసాలు, పరుపులు,
ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని భక్తులు, స్థానికుల విజ్ఞప్తి
కంబదూరు, జూలై 18:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల కేంద్రంలో ఉన్న పురాతన అక్కమ్మ ఆలయం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేణా రాజుల పాలనలో ఈ దేవాలయం అక్కమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఏపీ పురావస్తు శాఖ పరిధిలో కొనసాగుతున్న ఈ ఆలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవిస్తూ దానిని పబ్బుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఆలయ ఆవరణలో బీరు సీసాలు, మద్యం బాటిళ్లు, పరుపులు కనిపించడం భక్తులను కలవరపెడుతోంది.పవిత్రమైన ఈ పురాతన క్షేత్రంలో మద్యం సేవించి ఖాళీ సీసాలు, ఇతర వస్తువులను అక్కడే వదిలివేయడంతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఆలయానికి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆలయాన్ని పరిరక్షించాలని, పూర్వవైభవాన్ని తీసుకురావాలని భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే ఆలయ అభివృద్ధి, సంరక్షణపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పురాతన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు పురావస్తు శాఖతో పాటు సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని పర్యాటకులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.